యాప్నగరం

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిందా?

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న శివాజీరాజా వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశమైంది. నర్సాపురంలో జనసేన తరపున పోటీ చేస్తున్న నాగబాబుకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

Samayam Telugu 21 Mar 2019, 1:03 pm
‘మా’ ఎన్నికల్లో చివరి క్షణంలో నరేష్‌ ప్యానెల్‌కు మద్దతిచ్చి తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుపై శివాజీరాజా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనకు ఎన్నో ఏళ్లుగా మిత్రుడని, తన ఓటమికి కారణమైన ఆయనకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీరాజా వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది. అయితే శివాజీరాజా వ్యాఖ్యలను కొందరు లైట్ తీసుకోగా.. కొందరు మాత్రం ఆయన వెనుక ఎవరో ఉండి అలా మాట్లాడించారని అనుకున్నారు. అయితే శివాజీరాజా తాను చెప్పినట్లుగా నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేసినట్లే కనిపిస్తోంది. దీనికి తాజాగా జరుగుతున్న ప్రచారం ఊతమిస్తోంది.
Samayam Telugu pjimage (1)


నాగబాబు బుధవారం పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు శివాజీరాజా వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల్లో వైఎస్ జగన్‌తో సమావేశమై ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

‘మా’ ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన నాగబాబును ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నదే శివాజీరాజా ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు హడావుడిగా వైసీపీలో చేరుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు, శివాజీరాజా ఒకే జిల్లాకు చెందిన వారు. నాగబాబుది మొగల్తూరు కాగా, శివాజీరాజాది భీమవరం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.