యాప్నగరం

‘మహర్షి’.. నేను వెరీ లక్కీ: శంకర్ మహదేవన్

ఇప్పటికే విడుదలైన ‘మహర్షి’ టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాలోని మూడు పాటలను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగో పాట కూడా వచ్చేస్తోంది.

Samayam Telugu 23 Apr 2019, 8:24 pm
సూపర్ స్టార్ మహేష్‌బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై సి.అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Samayam Telugu Nagali-Still


ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాలోని మూడు పాటలను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగో పాట కూడా వచ్చేస్తోంది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ఈ పాటను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘పదర పదర’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పాట గురించి స్వయంగా శంకర్ మహదేవన్ చెప్పిన మాటలను నిర్మాత దిల్ రాజు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియోలో శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ మహేష్‌బాబు తొలి సినిమా ‘రాజకుమారుడు’లో బాలీవుడ్ బాలరాజుని అనే పాట పాడే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు మనందరికీ చారిత్రాత్మక క్షణం, సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’ని మనమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో పాట పాడే అవకాశన్ని నేను పొందాను. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట తెలుగులో అద్భుతమైన పాటల్లో ఒకటి అవుతుందని నేను భావిస్తున్నాను. ‘పదర పదర’ అంటూ సాగే ఈ పాట ఎంతో స్ఫూర్తినిచ్చే, శక్తివంతమైన, ఎమోషనల్ సాంగ్. ఈ పాట పాడే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పాట. సినిమాలో చాలా ముఖ్యమైన పాట. ఎవ్వరు పాడినా ఈ పాట అంతే శక్తివంతంగా ఉంటుంది. నాకు పాడే అకాశం రావడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌కి కృతజ్ఞతలు. ‘మహర్షి’ టీమ్‌కి ఆల్ ది వెరీ బెస్ట్’ అని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.