యాప్నగరం

Sirivennela Seetharama Sastry Death: సిరివెన్నెల ఇకలేరు.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

Sirivennela Died: ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’.. ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ’.. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని’.. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసే సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 30 Nov 2021, 5:16 pm
సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ఆగిపోయింది. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల కన్నుమూశారు. నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం.. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల.
Samayam Telugu సిరివెన్నెల
sirivennela seetharama sastry passed away


‘నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని.. అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని’.. ‘రామ బాణం ఆపింది రావణ కాష్టం ’’.. ‘‘కృష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం ’’ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నోస్ఫూర్తినిచ్చే గేయాలు రాసి.. తన సాహిత్యంతో ఉత్తేజాన్ని నింపిన సిరివెన్నెల సీతా రామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

1955 సంవత్సరం మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.

'సిరివెన్నెల' సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామ శాస్త్రి.. దర్శకుడు కె. విశ్వనాథ్‌తో కలిసి అన్ని సినిమాలకు పని చేశారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తుంటారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు. రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు.

గత కొన్ని దశాబ్ధాలుగా అద్భుతమైన పాటలను రచించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు సిరివెన్నెల. ''స్వర్ణక మలం, గాయం, శుభ లగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెలకు నంది అవార్డులు వరించాయి.

కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. 4 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఆయనకు 2019 సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పని చేసిన అనుభవమున్న సిరివెన్నెల.. ఈ మధ్యకాలంలో వెంకటేష్ నారప్ప, వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాల్లో పాటలు రాశారు. RRR సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన 'దోస్తీ' పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాశారు.. అవే ఆయన చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.