యాప్నగరం

రాజమౌళి పక్కన కూర్చోవడం గర్వంగా ఉంది: కె.విశ్వనాథ్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు.

TNN 18 Jan 2018, 1:34 pm
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పక్కన కూర్చోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. దీన్ని తనకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. రాజమౌళి ప్రతిభ, ఆయన సాధించిన విజయం చిన్న విషయం కాదని కొనియాడారు. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్రియేటివ్ మెంటర్స్ సంయుక్తంగా ‘ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిల్మ్ అండ్ మీడియా స్కూల్’ను స్థాపించారు. ఈ స్కూల్‌ను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని దర్శకుడు రాజమౌళి, కళాతపస్వి కె.విశ్వనాథ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజమౌళి, కె.విశ్వనాథ్ ప్రసంగించారు.
Samayam Telugu ss rajamouli and k vishwanath launched prasads creative mentors film media school
రాజమౌళి పక్కన కూర్చోవడం గర్వంగా ఉంది: కె.విశ్వనాథ్


సినీ పరిశ్రమ విజయం వెనుక ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ కృషి ఎంతో ఉందని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. గడిచిన 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ప్రసాద్ ల్యాబ్స్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ప్రసాద్ ల్యాబ్స్‌దని రాజమౌళి కొనియాడారు. ‘బాహుబలి’ సినిమాకు అవసరమైన కొత్త టెక్నాలజీకి సంబంధించిన మెషినరీ ప్రసాద్ ల్యాబ్స్‌లో లేకపోతే.. తమ సినిమా కోసం దాన్ని రెండు నెలల్లో ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు. ఈ విషయంలో సంస్థ యజమాని రమేష్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. తన తండ్రి ఎల్వీ ప్రసాద్ సినీ పరిశ్రమకు చేసిన సేవను గుర్తుచేశారు. అలాగే రాజమౌళి, ఆయన కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఒక కుటుంబం మొత్తం సినిమా కోసం పనిచేయడం గొప్ప విషయమన్నారు. అప్పట్లో రాజ్ కపూర్ కుటుంబం ఈ విధంగా పనిచేసిందని.. మళ్లీ ఇప్పుడు రాజమౌళి కుంటుంబాన్ని చూస్తున్నానని చెప్పారు. తన తండ్రి ఎల్వీ ప్రసాద్ 110వ జయంతిని పురష్కరించుకుని ఈ స్కూల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

స్కూల్ అందించే కోర్సులు ఇవే..
డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, రీ-రికార్డింగ్ కోర్సులను ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిల్మ్ అండ్ మీడియా స్కూల్లో అందించనున్నారు. ఈ డిప్లొమా కోర్సుల కాలపరమితి 6 నెలల నుంచి 18 నెలల వరకు ఉండనుంది. ప్రముఖ సంస్థలకు చెందిన మంచి అనుభవం కలిగిన అత్యుత్తమ ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌తో శిక్షణ ఇవ్వనున్నట్లు క్రియేటివ్ మెంటర్స్ వ్యవస్థాపకుడు సురేష్‌రెడ్డి కొవ్వూరి చెప్పారు. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, మార్చి నుంచి క్లాస్‌లు మొదలవుతాయన్నారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.