Stylish Star Allu Arjun Completes 17 Victorious Years In Telugu Film Industry
17 ఏళ్ల అల్లు అర్జున్ జర్నీ: సింహాద్రి నుంచి స్టైలిష్ స్టార్గా..!
సౌత్ ఇండియాలో ప్రస్తుతం మనకు డ్యాన్స్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. తన స్టైలిష్ డ్యాన్స్, పెర్ఫార్మెన్స్తో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా కేరళ ప్రేక్షకులను కూడా కట్టిపడేశారు బన్నీ.
Samayam Telugu28 Mar 2020, 4:42 pm
సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దింటి నుంచి హీరో వస్తున్నాడంటే కచ్చితంగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకోవడమే ఆ నటుడికి పెద్ద పరీక్ష. కానీ, ఆ అంచనాలను పటాపంచలు చేసి ఎవ్వరూ ఊహించిన స్థాయికి ఎదిగితే ఇక ఇండస్ట్రీలో అతనికి తిరుగుండదు. అలాంటి హీరోలు టాలీవుడ్లో కొంత మందే ఉన్నారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు స్వయానా మేనల్లుడు, దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు.. ఇంత బరువును తన నెత్తిమీద వేసుకుని హీరోగా పరిచయమయ్యారు బన్నీ. తొలి సినిమా ‘గంగోత్రి’ చూసినప్పుడు అంతా పెదవి విరిచారు. అసలు ఇతను హీరోనా అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ లేకపోతే ఇతను హీరో ఏంటి ఎగతాళి చేశారు. కానీ, ఆ సినిమాలో సింహాద్రి కనిపించిన కుర్రాడు నేడు స్టైలిష్ స్టార్గా టాలీవుడ్ను ఏలుతున్నాడు. అల్లు అర్జున్ వెండితెరకు పరిచయమై నేటికి 17 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన జర్నీ ఒకసారి చూద్దాం.
దర్శకేంద్రుడు పరిచయం చేసిన ఆణిముత్యం
‘గంగోత్రి’ సినిమా ద్వారా అల్లు అర్జున్ వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయనకు 100వ సినిమా ఇది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్కు చెందిన వైజయంతీ మూవీస్ లాంటి భారీ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. యం.యం.కీరవాణి సంగీతం. 2003 మార్చి 28న ఈ చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్. కీరవాణి అందించిన సంగీతం, రాఘవేంద్రరావు దర్శకత్వం ప్రతిభ ‘గంగోత్రి’ని ఒక మంచి ప్రేమకథా చిత్రంగా మలిచాయి.
‘ఆర్య’తో క్రేజ్
‘గంగోత్రి’ సినిమా హిట్ అయినా అది అల్లు అర్జున్కు వ్యక్తిగతంగా ఉపయోగపడలేదు. ఎందుకంటే సినిమా క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావుకే వెళ్లిపోయింది. అయితే, రెండో సినిమా ‘ఆర్య’తో తానేంటో నిరూపించారు బన్నీ. టాలీవుడ్లోకి మరో డ్యాన్స్ సెన్సేషన్ వచ్చిందని సంకేతాలు అందజేశారు. సుకుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. అల్లు అర్జున్ స్టైల్కి, డ్యాన్స్కి కేవలం మెగా అభిమానులే కాదు, ప్రేక్షకులే ఫిదా అయిపోయారు. ఆ తరవాత సంవత్సరం వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘బన్నీ’ సినిమా అల్లు అర్జున్ మార్కెట్ను అమాంతం పెంచేసింది.
టాలీవుడ్లో ఆ ట్రెండ్ తీసుకొచ్చిన బన్నీ..
సౌత్ ఇండియాలో డాన్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ను కమర్షియల్ హీరోయిజానికి జోడించిన నటుడు చిరంజీవి అయితే.. సిక్స్ ప్యాక్ ట్రెండ్ను టాలీవుడ్కి పరిచయం చేసింది అల్లు అర్జున్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఈ సినిమా రావడానికి ముందు తెలుగు చిత్రాల్లో ఏ హీరో ఇలా సిక్స్ ప్యాక్లో కనిపించలేదు. ఈ ట్రెండ్ను బన్నీ సెట్ చేసిన తర్వాత చాలా మంది తెలుగు హీరోలు సిక్స్ ప్యాక్లు చేశారు. ఈ సినిమా కమర్షియల్గానూ హిట్టయ్యింది. అయితే, ‘దేశముదురు’ సినిమా ముందు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ‘హ్యాపీ’ చిత్రాన్ని చేశారు బన్నీ. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
వరుస డిజాస్టర్లు
‘దేశముదురు’ లాంటి హిట్ సినిమా తర్వాత బన్నీ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోయింది. ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు పైస్థాయిలో ఉండేవి. అయితే, ఈ సినిమా తరవాత వచ్చిన ఐదు సినిమాలు ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పరుగు’, సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య 2’, గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘వరుడు’, క్రిష్ డైరెక్ట్ చేసిన ‘వేదం’, వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీనాథ్’ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ‘పరుగు’, ‘వేదం’ సినిమాలు ఫర్వాలేదనిపించినా.. మిగిలిన మూడు సినిమాలు మాత్రం డిజాస్టర్లు అయిపోయాయి. దీంతో అల్లు అర్జున్ కాస్త వెనకబడ్డారు.
నిలబెట్టిన త్రివిక్రమ్..
హిట్టు కోసం ఇబ్బందిపడుతున్న సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘జులాయి’ రూపంలో బన్నీకి బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా కమర్షియల్గా అల్లు అర్జున్ను మళ్లీ రేస్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమాతో బన్నీ మేనరిజంలో కూడా మార్పు వచ్చింది. దేవీశ్రీ మ్యూజిక్, త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, బన్నీ డాన్సులు, కామెడీ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. ఆ తరవాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’ నిరాశపరిచినా.. ‘రేసుగుర్రం’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ సినిమాలు అల్లు అర్జున్ క్రేజ్ను మరింత పెంచేశాయి. ‘రుద్రమదేవి’లో బన్నీ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు ప్రశంసల వర్షం కురిసింది. ఇక ‘సరైనోడు’ సినిమాతో బన్నీని ఊర మాస్ హీరోగా మార్చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను.
‘అల..’ ఇండస్ట్రీ హిట్
‘సరైనోడు’ వంటి మాస్ హిట్ తరవాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేశారు బన్నీ. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ సోల్జర్ పాత్రలో ఆయన కనిపించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. దీంతో సుమారు ఏడాదిన్నర విరామం తీసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బన్నీ. తనతో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేసిన దర్శకుడు త్రివిక్రమ్తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా అందించారు. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ 17 ఏళ్లలో బన్నీ మొత్తం 19 సినిమాలు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. బన్నీ ఫామ్ ఇలానే కొనసాగాలని.. మరిన్ని సూపర్ హిట్లు ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.