యాప్నగరం

మంచు విష్ణుతో రహస్య ఒప్పందం.. కౌంటర్ ఇచ్చిన ‘ఓటర్’ నిర్మాత

‘అడ్డా’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణుతో పొలిటికల్ డ్రామాగా ‘ఓటర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ‘ఓటర్’ చిత్ర హీరో, దర్శకుడి మధ్య వివాదం రేగింది.

Samayam Telugu 3 May 2019, 4:41 pm
హీరో మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ‘ఓటర్’ చిత్ర దర్శకుడు కార్తీక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఓటర్’ సినిమా విషయంలో జరిగిన ఒక తప్పుడు ఒప్పందాన్ని కారణంగా చూపి తనను విష్ణు మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ కార్తీక్ రెడ్డి సినీ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీనిపై చిత్ర నిర్మాత పూదోట సుధీర్ కుమార్ (జాన్ సుధీర్) కూడా స్పందించారు. ఆ ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
Samayam Telugu John_Sudheer_Manchu_Vishnu


‘ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ‘ఓటర్‌’ సినిమా మొదలు పెట్టడానికి ముందే కథపై అనుమానం వచ్చి విష్ణు, చిత్ర నిర్మాతలు, దర్శకుడు కార్తీక్ రెడ్డి కూర్చొని ‘అసెంబ్లీ రౌడీ’ స్క్రీన్‌ప్లే దీనికి బాగుంటుందని నిర్ణయానికి వచ్చారని చెప్తున్న మాటలు అవాస్తవాలు. ‘అసెంబ్లీ రౌడీ’ స్క్రీన్‌ప్లేకి సంబంధించి మా మధ్య ఎలాంటి సమావేశాలు, చర్చలు జరగలేదు. దర్శకుడు కార్తీక్ రెడ్డి ఈ ఏడాది మార్చి 27న సుమారు 3 గంటల సమయంలో నా దగ్గరకు వచ్చాడు.

మంచు విష్ణు, అతని స్నేహితుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి తనను వాళ్ల ఇంటికి అల్పహార విందుకు అని పిలిచి, పథకం ప్రకారం ముందుగానే సిద్ధం చేసుకున్న అగ్రిమెంట్‌ మీద అంటే 2017 మార్చి 23 తేదిన సిద్ధం చేసిన అగ్రిమెంట్‌ మీద తన చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారని కార్తీక్ చెప్పాడు. అగ్రిమెంట్ ప్రకారం ‘అసెంబ్లీ రౌడీ’ కథ, సన్నివేశాలు, స్క్రీన్‌ప్లేని వాడుకున్నందుకు రూ.1 కోటి 50 లక్షలు చెల్లించాలి. అది తప్పడు అగ్రిమెంట్‌ అని, వాళ్ల నుండి తనను కాపాడమని కార్తీక్ మొర పెట్టుకున్నాడు. అంతే తప్ప కార్తీక్‌ రెడ్డికి నాకు మధ్య ఈ విషయంలో ఎటువంటి చర్చలు జరగలేదు.

అలాంటిది ఇప్పుడు కార్తీక్‌ రెడ్డి, మంచువిష్ణు, ఆయన స్నేహితుడు విజయ్‌ కుమార్‌ రెడ్డిల మధ్య జరిగిన రహస్య అగ్రిమెంట్‌కి సంబంధించి నన్ను డబ్బులు కట్టమనడం ఎంత వరకూ సమంజసం. గొడవలకు ముఖ్య కారణం సినిమా బాగా రావడమే. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకమే’ అని జాన్ సుధీర్ ప్రకటనలో పేర్కొన్నారు.

‘అడ్డా’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ రెడ్డి.. మంచు విష్ణుతో పొలిటికల్ డ్రామాగా ‘ఓటర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ‘ఓటర్’ చిత్ర హీరో, దర్శకుడి మధ్య వివాదం రేగింది. ఈ వివాదంతో తనకు సంబంధంలేదని నిర్మాత తేల్చేశారు. మరి ఈ సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.