యాప్నగరం

మీ స్వరం, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే జీవించి ఉంటాయి: రజినీకాంత్ భావోద్వేగం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Samayam Telugu 25 Sep 2020, 4:56 pm
బాలు పాట లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా లేదు. తలైవా సినిమాలో కచ్చితంగా బాలు సోలో సాంగ్ ఉండాల్సిందే. రజినీ సినిమా వస్తుందంటే అందులో బాలు పాట కోసం వేచి చూసే అభిమానులు ఎంతో మంది. ఇంచుమించుగా రజినీ అన్ని సినిమాల్లోనూ బాలు పాడారు. కొన్ని సినిమాల్లో మొత్తం పాట పాడకపోయినా ఆయన గొంతుని కచ్చితంగా వినిపించారు. ఈ ఏడాది వచ్చిన రజినీకాంత్ మూవీ ‘దర్బార్’లోనూ ‘దుమ్ము ధూళి’ అనే మాస్ సాంగ్‌ను బాలు ఆలపించారు. ఇప్పుడు బాలు పాట లేని రజినీ సినిమాను ఊహించుకోవడం కష్టం అంటున్నారు రజినీ ఫ్యాన్స్.
Samayam Telugu రజినీకాంత్, బాలసుబ్రహ్మణ్యం
Rajinikanth mourns SPB death


అభిమానులు మాత్రమే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇదే ఫీలవుతున్నారు. ‘‘బాలు సార్.. ఎన్నో ఏళ్లుగా మీరు నా గొంతుక అయ్యారు. మీ స్వరం, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే జీవించి ఉంటాయి. మిమ్మల్ని నిజంగా కోల్పోతున్నాను’’ అని రజినీకాంత్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఒక వీడియోను కూడా ట్వీట్‌లో పొందుపరిచారు.

Also Read: సంగీత ప్రపంచం నిరుపేదదైంది.. ప్రధాని మోదీ భావోద్వేగం

‘‘ఈరోజు దుర్దినం. ఆఖరి నిమిషం వరకు పోరాడిన గౌరవనీయులైన ఎస్పీబీ గారు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మృతి మనందరికీ ఎంతో బాధాకరం, షాక్ కూడా. ఇండియాలో ఎస్పీబీ పాటలకు, ఆయన స్వరానికి అభిమాని కాకుండా ఎవ్వరూ ఉండరు. బాలు గురించి తెలిసిన వారు ఎవరైనా ఆయన పాటలు, స్వరం కన్నా ఆయన మానవత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే వ్యక్తి ఆయన. దయా హృదయుడు, ఆప్యాయత గలవారు.
ఫోటోస్: గాన‌గంధ‌ర్వుడు వదిలి వెళ్లిన అరుదైన జ్ఞాపకాలు

భారతీయ సినిమా పరిశ్రమ మనకు మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఘంటసాల, టిఎం సౌందరాజన్ వంటి ఎంతో మంది గొప్ప గాయకులను ఇచ్చింది. కానీ, ఎస్పీబీ వీరందరికంటే ప్రత్యేకం. ఎందుకంటే, వారంతా వారి వారి భాషల్లో పాటలు పాడారు. కానీ, ఎస్పీబీ ఎన్నో భాషల్లో గానం చేశారు. అందుకే, భారతదేశంలోని అందరికీ ఆయన తెలుసు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆయన అభిమాని కానివారంటూ ఎవరూ ఉండరు.

మరో 100 ఏళ్లు ఆయన స్వరం మన చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ఆ గళాధిపతి మనతో ఇకలేరు అనే విషయాన్ని ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. గొప్ప గాయకుడు, గొప్ప మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని వీడియోలో రజినీకాంత్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.