యాప్నగరం

కోరిన కోర్కెలు తీర్చే ఒడిశా మాతా ఘంటేశ్వరి ఆలయం... త్వరలోనే అరుదైన రికార్డు

ఒడిశాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మాతా గంటేశ్వరి ఆలయం ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోనే ఒక అరుదైన రికార్డుకు వేదికగా మారనుంది. తద్వారా ఒడిశా పర్యాటకంలో ఈ ఆలయం తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతుంది.

Samayam Telugu 30 Jan 2020, 11:49 am
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) ఒక ఆసక్తికరమైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఒడిశాలోని సంబల్పూర్ శివార్లలో చిప్లిమాలో ఉన్న మాతా ఘంటేశ్వరి ఆలయంలో ఎంసిఎల్ భారత దేశపు అతిపెద్ద ఆలయ గంటను ఏర్పాటు చేస్తుంది. ఆలయం యొక్క కీర్తిని వ్యాప్తి చేసేందుకు, సందర్శకులను ఆకర్షించేందుకు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. మాతా గంటేశ్వరి వద్ద ఏర్పాటు చేయబోయే ఈ ఇత్తడి గంట ఈ పుణ్యక్షేత్రానికి మరింత ఆకర్షణను ఇవ్వడమే కాకుండా పగలు, రాత్రి మోగడం ద్వారా ఈ ప్రాంతం యొక్క దైవత్వాన్ని మరింత పెంచుతుంది.
Samayam Telugu మా ఘంటేశ్వరి ఆలయం


ధన్కుడా బ్లాక్ లోని చిప్లిమా సమీపంలో ఉన్న మాతా ఘంటేశ్వరి మందిరం దాని గర్భగుడి చుట్టూ వేలాడే అనేక గంటలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని లైట్ లెస్ లైట్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇది నావికులచే నిర్మించబడినదిగా చెబుతారు. భారీ గాలుల నుంచి రక్షణగా వారికి ఈ ఆలయ గంటలు నిలిచాయి. ఈ గంటలు ప్రారంభంలో నావికులను హెచ్చరించడానికి, మార్గనిర్ధేశనం చేయడానికి కూడా ఉపయోగించబడ్డాయి.

ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం మూడు ప్రవాహాల సమ్మేళనం. ఇక్కడి మహానది పూర్వ కాలంలో అనేక సుడులను కలిగి ఉండేది. ఈ కారణంగా ఇందులో అనేక పడవలు మునిగిపోయేవి. కాబట్టి ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఏ నావికుడినైనా హెచ్చరించడానికి ఈ ఆలయంలోని గంటలను తీవ్రంగా మోగించేవారు. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని కాంతి లేని లైట్ హౌస్ (లైట్ లెస్ లైట్ హౌస్) అని పిలిచేవారు. అయితే ఇక్కడికి సమీపంలో హిరాకుడ్ ఆనకట్ట నిర్మాణం తరువాత ఈ ప్రదేశం సురక్షితంగా మారింది. ఈ ఆలయానికి సమీపంలో చిప్లిమా హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఉంది.

Read Also: హిమాచల్ లో లెక్కించలేనంత సంపద గల కమ్రునాగ్ సరస్సు... మిస్టరీ ఇదే

కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు

మాతా ఘంటేశ్వరి అమ్మవారిని భక్తితో కోరుకునే కోర్కెలు తప్పక నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత మాతా ఘంటేశ్వరి ఆలయంలో గంటలను కడుతుంటారు. చిప్లిమా నడిబొడ్డులో ఉన్న ఈ మందిరం స్థానిక ప్రజలకు ఒక అందమైన పిక్నిక్ ప్రదేశంగా కూడా పేరొందింది. ఇరుకైన ఇనుప వంతెన ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీకు ఇది ఒక మంచి ప్రదేశం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ ఆలయం తెరిచి ఉంటుంది.

సందర్శనకు సరైన సమయం:

మాతా ఘంటేశ్వరి ఆలయ సందర్శనకు సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను కూడా చూసి రావొచ్చు.

సమీప పర్యాటక ఆకర్షణలు:

- సమలేశ్వరి ఆలయం

- జింకల పార్కు

- బుధరాజ ఆలయం

- దధిబమన్ ఆలయం

- ఖలసుని వన్యప్రాణి అభయారణ్యం

Read Also: గోవాలో వింత గ్రామం... ఏడాదిలో ఒక్క నెల మాత్రమే కనిపిస్తుంది

ఎలా చేరుకోవాలి

వాయు మార్గం:

ఇక్కడికి సమీప విమానాశ్రయాలు రెండు ఉన్నాయి. వీటిలో రాయ్ పూర్ లో ఉన్న స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ ఇక్కడికి 265 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే భువనేశ్వర్ లో ఉన్న బిజూ పట్నాయక్ ఎయిర్ పోర్ట్ ఈ ఆలయానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాతా ఘంటేశ్వరి ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఝర్సుగూడ వద్ద పారిశ్రామిక టౌన్ షిప్ లో ఒక కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఈ ఆలయానికి విమానం ద్వారా రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

రైలు మార్గం:

ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ హిరాకుడ్. ఇది కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గం:

సంబల్ పూర్ సిటీ లేదా హిరాకుడ్ స్టేషన్ నుంచి మీరు ఇక్కడికి రావాలనుకుంటే బర్గర్-సంబల్ పూర్ రోడ్డు మీదుగా గోశలకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఎడమ వైపుగా ఉండే చిప్లిమా రోడ్డు మీదుగా ప్రయాణించి మాతా ఘంటేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.