యాప్నగరం

Dharmashala Tour: ధర్మశాల ఎప్పుడైనా వెళ్లారా.. లేదంటే ఇప్పుడు వెళ్లండి.. ఇదే కరెక్ట్ సీజన్

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అంటేనే టూరిస్ట్ డెస్టినేషన్లకు నెలవు. ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా అది పర్యాటక ప్రదేశంగానే ఉంటుంది. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, ఆహ్లాదంగా ఉండే చల్లని వాతావరణం, నదులు, సెలయేళ్లు.. ఇవన్నీ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే, హిమాచల్‌లోని ధర్మశాల కూడా అలాంటి ఓ అందమైన హిల్ స్టేషన్ కావడంతో మంచి పర్యాటక ప్రదేశంగా పేరుతెచ్చుకుంది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 19 Sep 2022, 4:47 pm
ధర్మశాల (Dharmashala Hillstation) హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌గా ఉంది. ఇది హిమాచల్‌ రాష్ట్రానికి శీతాకాల రాజధానిగానూ సేవలందిస్తోంది. శీతాకాలంలో షిమ్లా మంచుతో నిండిపోతుండటంతో వింటర్ క్యాపిటల్‌గా ధర్మశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ రాష్ట్ర కార్యకలపాలు ఇక్కడి నుండి కూడా జరుగుతాయి. ఇది కేవలం రాజధానిగానే కాకుండా హిమాచల్‌లోని టాప్ టూరిస్ట్ స్పాట్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఇదో హిల్ స్టేషన్ కావడంతో నిత్యం పర్యాటకులు వస్తుంటారు. అయితే,ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ధర్మశాల నగరం రెండు భాగాలుగా ఉంటుంది.
Samayam Telugu dharmasala


ఒకటి దిగువ ధర్మశాల. రెండోది ఎగువ ధర్మశాల. దిగువ ధర్మశాలలో వాణిజ్య కార్యకలాపాలు మెండుగా జరుగుతాయి. ఇక్కడ మార్కెట్లు, దుకాణాలు, ప్రసిద్ధ కొత్వాలి బజార్‌తో పాటు రోజువారీ వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక ఎగువ ధర్మశాలలో మెక్లీయోడ్‌గంజ్‌తో (Dharmashala Mcleodganj) పాటు ఇతర భవనాలు దాని పూర్వ వైభవాన్ని గుర్తుకుతెస్తాయి. టూరిస్టులుగా ఈ రెండు ప్రాంతాలను మీరు ఆస్వాదించవచ్చు. ఇక్కడ అందమైన పరిసరాలతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో విశ్రాంతి తీసుకోవడానికి, సేద తీరడానికి ధర్మశాల చాలా అద్భుతంగా ఉంటుంది.

మెక్లియోడ్‌గంజ్..
మెక్లియోడ్‌గంజ్(Mcleodganj) అనే ప్రాంతం ధర్మశాల ఎగువ ప్రాంతంలో ఉంటుంది. ఇదో అందమైన హిల్ స్టేషన్ కావడంతో చుట్టూ ప్ర‌కృతి సోయగాలకు కొదవే లేదు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,770 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా అధికారిక నివాసం కూడా ఉంది. బ్రిటీష్ కాలంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సర్ డోనాల్డ్ ప్రీల్ మెక్లియోడ్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడంతో దీనికి ఈ పేరు వచ్చింది.

నమ్‌గ్యాల్ మోనాస్టరీ..
ఈ నమ్‌గ్యాల్ మోనాస్టరీ (Namgyal Monastery) కూడా దలైలామాకు నిలయంగా ఉంటుంది. టిబెట్ తర్వాత ఇక్కడే అంత పెద్ద బౌద్ధ మఠం ఉంది. దీన్ని 16వ శాతాబ్దంలో రెండో దలైలామా నిర్మించగా అప్పటి నుంచి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నివసించే సన్యాసులు నిత్యం తమ ప్రార్ధనలు, వగైరా చేసుకుంటారు. అలాగే మెడిటేషన్ వంటివి కూడా నేర్పిస్తారు. దీంతో ఈ బౌద్ధ మఠాన్ని చూడటానికి కూడా పర్యాటకులు ఆసక్తి చూపుతారు.

భాగ్‌సునాగ్ వాటర్ ఫాల్స్..
ఈ భాగ్‌సునాగ్ జలపాతం (Bhagsunag Waterfalls) ధర్మశాల నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఇది ధర్మశాలలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అక్కడే ఒక పురాతనమైన దేవాలయం ఉంది. ఈ జలపాతం చుట్టూ అందమైన చెట్లతో నిండి ఉండటంతో పచ్చగా కళకళలాడుతుంది. ఇక్కడ చల్లని నీరు పై నుండి కిందకు దూకుతుంటే అందులో తడిస్తే మైమరిపోతారు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే మరింత బాగా ఎంజాయ్ చేయొచ్చు.

సెంట్ జాన్స్ చర్చి..
ఇక ధర్మశాలలో మరో చూడదగ్గ ప్రదేశం సెంట్ జాన్స్ చర్చి (St.John Church). ఇదో అద్భుతమైన కట్టడం. మెక్లియోడ్‌గంజ్ లోయలో ధర్మశాలకు 8 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. ఈ చర్చి దట్టమైన అడవిలో కట్టడంతో చాలా అందంగా ఉంటుంది. దీంతో పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బ్రిటీష్ పాలనలో భారతదేశ వైస్రాయ్‌లలో ఒకరైన లార్డ్ ఎల్గిన్‌ 1863లో మరణించాక ఇక్కడే ఖననం చేశారు. 1905 వచ్చి భారీ భూకంపాన్ని సైతం ఈ చర్చి తట్టుకొని నిలబడటం విశేషం.

ధరమ్‌కోట్ పిక్‌నిక్ స్పాట్..
ధర్మశాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ధరమ్‌కోట్ (Dharamkot) సైతం మంచి పిక్‌నిక్ స్పాట్. ఇది కూడా కొండ ప్రాంతం కావడంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుండి కాంగ్రా లోయతో పాటు ధౌలాధర్ పర్వత శ్రేణులను కూడా చూడొచ్చు. ఈ ప్రాంతానికి భాగ్సు నుండి ట్రెక్కింగ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భోజన ప్రియులు మార్గమధ్యలో మంచి మంచి రెస్టారెంట్లలో రుచికరమైన ఆహారాన్ని లాగించొచ్చు.

వార్ మెమోరియల్..
ధర్మశాలలో వార్ మెమోరియల్ (War Memorial) కూడా చూడదగ్గదే. ఇది ధర్మశాలకు వెళ్లేముందే ఉంటుంది. మాతృభూమి కోసం ధైర్యంగా పోరాడిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. ఇది పైన్ ఫారెస్ట్‌లో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంది. అందిస్తుంది. చుట్టూ విశాలమైన ఉద్యానవనాలు ఈ వార్ మెమోరియల్‌కు మరింత అందాలు తీసుకొచ్చాయి. వివిధ యుద్ధాల్లో ఇక్కడి అనేక మంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించగా వారి జ్ఞాప‌కార్ధం దీన్ని నిర్మించారు.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.