యాప్నగరం

గిరి ప్రదక్షిణం: 32 కిమీలు నడుస్తూ, నరహరిని జపిస్తూ..

ఆషాడ చతుర్దశి పురస్కరించుకుని గురువారం విశాఖపట్నంలో సింహగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలస్తూ కాలినడకన సింహాగిరి చూట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

Suresh Chelluboyina | Samayam Telugu 26 Jul 2018, 4:55 pm
షాడ చతుర్దశి పురస్కరించుకుని గురువారం విశాఖపట్నంలో సింహగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు అప్పన్న స్వామిని తలస్తూ కాలినడకన సింహాగిరి చూట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
Samayam Telugu 12111


గిరి ప్రదక్షిణ అంటే?: సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాడ పౌర్ణమి నాడు ‘సింహాద్రి అప్పన్న’ ఉత్సవం నిర్వహిస్తారు. దీన్నే ‘గిరి పౌర్ణమి’ అని కూడా అంటారు. పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలి నడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అదే రోజు రాత్రి సింహాచలానికి చేరుకుని, పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొండచుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయొచ్చు. చాలామంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు. సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ.. భూ ప్రదక్షిణతో సమానమని చెబుతారు.
పుష్ప రథం: మధ్యాహ్నం 2 గంటలకు స్వామి నిజనిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు బయలుదేరింది. ఈ రథాన్ని తొలి పావంచా వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఇలా సాగుతుంది: అడవివరం కూడలి, ఫైనాపిల్‌ కాలనీ, సెంట్రల్‌ జైల్‌, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, అప్పుఘర్‌, సీతమ్మధార అల్లూరి విగ్రహం, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌, పోర్టు స్టేడియం, మాధవధార, మురళీనగర్‌, ఆర్‌ అండ్‌ బి, ఎన్‌ఏడీ జంక్షన్‌, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్‌, పాతగోశాల మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు ప్రదక్షిణ చేరుకుంటుంది.
విశాఖవాసుల పెద్ద మనసు: గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని సింహగిరి చుట్టూ పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేసే భక్తులకు ప్రజలే స్వచ్ఛందంగా సేవలందిస్తారు. దారి పొడవునా నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందిస్తూ భక్తుల ఆకలి, దప్పికలు తీర్చుతారు. కొండ చుట్టూ సుమారు 32 కిమీల పొడవునా ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ శిబిరాలు ఏర్పాటుచేసి సేవలు అందిస్తారు. అప్పన్న ఉత్సవంలో భాగంగా పూల రథం ఊరేగింపు మరింత ఆకర్షనీయంగా ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.