యాప్నగరం

Blue City: ఇదేదో గ్రీస్ దేశం అనుకుంటే పొరపాటే.. మన దేశంలోనే ఉంది ఈ ‘బ్లూ సిటీ’

రాజస్థాన్‌లోని (Rajasthan Tourist Places) రెండో పెద్ద నగరం జోధ్‌పూర్. దీన్ని బ్లూ సిటీగానూ పిలుస్తారు. ఆ నగరంలో ఎటు చూసినా నీలిరంగు మేడలే కనిపిస్తుండటంతో ఆ పేరొచ్చింది. అలాగే ఇదో మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. దీంతో ఈ జోధ్‌పూర్‌ను చూడటానికి నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఆ నగరం ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 2 Nov 2022, 5:06 pm
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో ఉన్న జోధ్‌పూర్ (Jodhpur) ఒకప్పుడు సొంత రాష్ట్రంగా రాచరిక పాలన సాగించింది. దేశానికి స్వాతంత్రం రాక ముందు ఈ ప్రాంతాన్ని ‘మార్వార్’ సంస్థానాధీశులు పాలించారు. మారు అంటే సంస్కృతంలో ఎడారి అని అర్థం. వాడ్ అంటే ఒక ప్రాంతమని అర్థం. దాన్ని ఇంగ్లిష్‌లో ‘మార్వార్’ అని పిలుస్తారు. అంటే ఇదో ఎడారి ప్రాంతమని అర్థం. స్వాతంత్రం తర్వాత జోధ్‌పూర్ రాజస్థాన్‌ రాష్ట్రంలో అంతర్భాగమైపోయింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. (Photo Credit: Unsplash)
Samayam Telugu have you ever visited jodhpur the blue city of india
Blue City: ఇదేదో గ్రీస్ దేశం అనుకుంటే పొరపాటే.. మన దేశంలోనే ఉంది ఈ ‘బ్లూ సిటీ’



​బ్లూ సిటీగానూ పిలుస్తారు..

మరోవైపు జోధ్‌పూర్‌ను బ్లూ సిటీగానూ పిలుస్తారు. ఇక్కడ ఉండే భవనాలన్నీ నీలిరంగులో నిగనిగలాడుతుంటాయి. దీంతో దీన్ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఎటు చూసినా బ్లూ కలర్ భవనాలే దర్శనమిస్తాయి. అలా ఈ నగరం మొత్తం చూడటానికి చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎలాంటి టూరిస్టులైనా ఈ బ్లూ సిటీని సందర్శిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. అంత గొప్ప నగరంగా పర్యాటకుల్ని ఆకర్షించేలా ఉంటుంది. (Photo Credit: Unsplash)

​చరిత్ర ఏం చెబుతుంది..

జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రాథోడ్ వంశానికి చెందిన రావ్ జోధా రాజ్‌పుత్ కనుగొన్నారు. ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలను జయించడంతో ‘మార్వార్’ అని పిలిచే రాజ్యాన్ని నిర్మించాడు. జోధా మండోర్ పట్టణానికి చెందిన వ్యక్తి కావడంతో మొదట ఆ పట్టణమే ఆ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. తర్వాత జోధ్‌పూర్ ప్రధాన కేంద్రంగా మారింది. అప్పట్లోనే ఈ నగరం దిల్లీ, గుజరాత్‌లను కలిపే రహదారిపై ఉండేది. దీంతో ఇక్కడ కూడా మంచి వ్యాపారం జరిగేది. (Photo Credit: Unsplash)

​అద్భుతమైన మెహ్రాన్‌గఢ్ కోట..

జోధ్‌పూర్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో మెహ్రాన్‌గఢ్ కోట ఒకటి. ఇది ఒక పెద్ద కొండపై నిర్మించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కోట చుట్టూ పాత జోధ్‌పూర్ నగరం విస్తరించి ఉంది. ఈ భారీ కోటకు ఎత్తైన గోడలు ఉండటంతో ఇప్పటికీ శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందుతోంది. ఈ కోటకు అనేక ద్వారాలు ఉండటంతో పాటు అవెంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ కోట చుట్టూ జోధ్‌పూర్ అంతకంతకూ విస్తరించుకుపోతోంది. (Photo Credit: Unsplash)

​విద్యాసంస్థలకు నిలయం..

ఈ జోధ్‌పూర్ నగరం అనేక విద్యాసంస్థలకు కూడా నిలయంగా ఉంది. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జోధ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డాక్టర్ సంపూర్ణానంద్ మెడికల్ కాలేజ్, DSRRAU జోధ్‌పూర్, నేషనల్ లా యూనివర్సిటీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, డెసర్ట్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రసిద్ధి విద్యాలయాలు ఉన్నాయి. (Photo Credit: Unsplash)

​మంచి పర్యాటక ప్రదేశం..

ఈ జోధ్‌పూర్ మంచి పర్యాటక ప్రదేశంగానూ పేరు తెచ్చుకుంది. ఇక్కడ అనేక రాజభవనాలు, కోటలు, దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు ప్రతి ఒక్కర్నీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాగే ఇక్కడ థార్ ఎడారి అందాలను కూడా ఆస్వాదించొచ్చు. దీంతో ఈ జోధ్‌పూర్ తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ది న్యూయార్క్ టైమ్స్ 2020 కథనం ప్రకారం ప్రపంచంలో తప్పక సందర్శించాల్సిన స్థలాల్లో 52వ స్థానం దక్కించుకుంది. (Photo Credit: Unsplash)

​ఇంకా చూడాల్సినవి..

ఇక్కడ చూడాల్సిన అద్భుతమైన కట్టడాలు, రాజభవనాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా, క్లాక్ టవర్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే మాండోర్ గార్డెన్, కైలానా సరస్సు, బాల్సమండ్ సరస్సు, మచియా బయోలాజికల్ పార్క్, రావు జోధా ఎడారి రాక్ పార్క్, రతనాడ గణేష్ ఆలయం, మసూరియా హిల్స్, వీర్ దుర్గాదాస్ స్మారక చిహ్నం, సుర్పురా డ్యామ్, భీమ్ భడక్ గుహ వంటివి ఉన్నాయి. ఇక థార్ డెసర్ట్ అందాలను కూడా తప్పక ఆస్వాదించాల్సినదే. (Photo Credit: Unsplash)

ఇవి కూడా చాలా ఫేమస్..

అలాగే జోధ్‌పూర్‌లో మరిన్ని విశేషాలు కూడా ఫేమస్‌గా నిలుస్తున్నాయి. రాజస్థాన్ థాలీ ఆహారం, పురాతన వస్తువులతో పాటు అక్కడి మార్కెట్లలో లభించే సంప్రదాయ దుస్తులు, సంప్రదాయ బూట్లు పర్యాటకులకు తప్పకుండా నచ్చుతాయి. వీటితో పాటు అనేక దేవాలయాలు సైతం ఇక్కడ సందర్శకులు దర్శించుకోవచ్చు. (Photo Credit: Unsplash)

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.