యాప్నగరం

జలక్రీడలు ఆపండి: ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశం

అడ్వేంచర్స్ కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లే పర్యాటకులకు ఇది చేదు వార్తే. ఇకపై అక్కడ ఇకపై ‘అడ్వేంచర్స్’ కనిపించవు.

Samayam Telugu 22 Jun 2018, 4:34 pm
నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ఉత్తరాఖండ్‌లో ఇకపై ‘అడ్వేంచర్స్’ కనిపించవు. ఎందుకంటే.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వాటర్ స్పోర్ట్స్, పారాగ్లైడింగ్, వైట్ రివర్ రాఫ్టింగ్‌లను నిషేదించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం పారదర్శక విధానాలు రూపొందించే వరకు ఈ నిషేదం అమలు చేయాలని కోర్టు పేర్కొంది.
Samayam Telugu 231


అడ్వేంచర్స్ కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లే పర్యాటకులకు ఇది చేదు వార్తే. ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో ఏటా రివర్ రాఫ్టింగ్ (వేగంగా ప్రవహించే నదిలో బోటు ప్రయాణం) మరణాలు పెరుగుతున్నాయి. బోటు తిరగబడటం వల్ల నదిలో కొట్టుకుపోయి పర్యాటకులు మరణిస్తున్నారు. ఇలాంటి క్రీడలకు సరైన శిక్షకులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి క్రీడలకు తగిన శిక్షణ పొందిన నిపుణులను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

‘‘క్రీడలు ఆనందాన్ని కలిగించాలే గానీ.. ఆపదలో పడేయకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి సాహస క్రీడలకు ప్రభుత్వం పారదర్శక ప్రక్రియ లేకుండా టెండర్లను ఆహ్వానించడం, తగిన ధరలు నిర్ణయించకుండా నదులను వినియోగించడానికి అనుమతులు ఇవ్వకూడదని తెలిపింది.

‘‘నదీ తీరాల్లో శిబిరాలు (క్యాంపింగ్ సైట్లు) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాం. దీనివల్ల నదితోపాటు పరిసర ప్రాంతాలు కలుషితం అవుతాయి. పర్యావరణానికి కూడా నష్టమే’’ అని జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ లోక్‌పాల్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది. అలాగే, రివర్ రాఫ్టింగ్ ప్రాంతాల వద్ద వాహనాల రద్దీ పెరిగిందని, నదీ తీర ప్రాంతాల వరకు వాహనాలను అనుమతించవద్దని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం రెండు వారాల్లో పారదర్శక విధానాలను రూపొందించాలని ఆదేశించింది. అప్పటివరకు ఈ నిషేదం కొనసాగుతుందని ధర్మసానం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.