యాప్నగరం

Goa Travel Advisory: గోవా పర్యాటకులకు కొత్త హెచ్చరిక.. ఇకపై ఆ పని కూడా చేయకూడదు!

గోవా పర్యాటకులకు అక్కడి టూరిజం శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు ఇతరుల ఫొటోలు తీయొద్దని ఆదేశించింది. పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 1 Feb 2023, 5:27 pm
ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ గోవాకు వెళ్లాలనుకునేవారికి అక్కడి పర్యాటక శాఖ కొత్త మార్గదర్శనకాలను విడుదల చేసింది. టూరిస్టులు ఇకపై అక్కడికి వెళ్లినప్పుడు అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు తీయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ అలా ఫొటోలు తీసుకోవాల్సి వస్తే ముందే వారి నుంచి అనుమతి పొందాలని చెప్పింది. తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారికి అత్యుత్తమ ఆతిథ్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (Photo Credit: Unsplash)
Samayam Telugu goa-thumb


ప్రయాణికుల గోప్యతను రక్షించడం, వారి భద్రతను కాపాడటంతో పాటు ఇతర విషయాల్లో టూరిస్టులు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో అక్కడి పర్యాటక శాఖ ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది.‘ఇతర పర్యాటకుల అనుమతి లేకుండా సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవద్దు. ప్రత్యేకించి బీచ్‌లలో సన్ బాత్ చేస్తున్నప్పుడు లేదా సముద్రంలో ఈత కొడుతున్నప్పుడు వారి గోప్యతను గౌరవించాలి’ అని అందులో పేర్కొంది.

అలాగే పర్యాటక ప్రదేశాల్లో అనుకోని విధంగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి కూడా పర్యాటక శాఖ పలు ఆదేశాలను జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో టూరిస్టులు.. రాళ్ళు, కొండలు, గుట్టల అంచులపై నిల్చొని ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడాన్ని కూడా నిషేధించింది. మరోవైపు సందర్శనీయ ప్రాంతాల్లోని కట్టడాలు, స్మారక చిహ్నాలు, లేదా వారసత్వ ప్రదేశాలను పర్యాటకులు నాశనం చేయొద్దని ఆదేశించింది.

పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని, గోవాలో ఎక్కడికైనా వెళ్లడానికి అనధికార ప్రైవేట్ టాక్సీలను వాడొద్దని చెప్పింది. బదులుగా మీటర్ ట్యాక్సీలనే వినియోగించుకోవాలని సూచించింది. అదే క్రమంలో టూరిస్టులు వసతి కోసం పర్యాటక శాఖచే గుర్తింపు పొందిన హోటల్స్, రిసార్టులను బుక్ చేసుకోవాలని కోరింది. ఇక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం కూడా పర్యాటకులు అనధికార ఏజెంట్లను సంప్రదించవద్దని చెప్పింది. ఇక బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంతో పాటు ఆహారం వండుకొని తినడం కూడా ఇదివరకే గోవాలో నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో గోవా వెళ్లాలనుకునే పర్యాటకులు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.