యాప్నగరం

Harappan Culture Museum: హరియాణాలో సింధూ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద మ్యూజియం

ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ (Indus Civilization) అంటే సింధూ నాగరికత అని అందరికీ తెలిసిందే. దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఇదీ ఒకటి. 1921లో తొలిసారి పంజాబ్ ప్రాంతంలోని హరప్పాలో ఈ నాగరికతకు సంబంధించిన విషయాలను, చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. దీంతో సింధూ నాగరికత గురించి ప్రపంచానికి తెలిసింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 12 Sep 2022, 4:44 pm
ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో సింధూ నాగరికతకు (Harappan Culture) ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ప్రి హరప్పా (c.7000-c.5500 BCE), ఎర్లీ హరప్పా(C.5500-2800 BCE), మెచ్యూర్ హరప్పా(c.2800-c.1900 BCE), లేట్ హరప్పా(c.1900-c.1500 BCE), పోస్ట్ హరప్పా(c.1500-c.600 BCE) అంటూ ఐదు కాలాలుగా విభజించారు. అంటే హరప్పన్ కల్చర్‌‌కు ఈ ప్రపంచంలో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సింధూ నాగరికత కాలంలోని రెండు అతిపెద్ద నగరాలే హరప్పా, మోహంజాదారో. ఇవి భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అయితే, ఈ హరప్పన్ కల్చర్‌కు సంబంధించిన అనేక విషయాలను పురావస్తు శాఖ వారు కొంతకాలంగా హరియాణాలోని రాఖీగర్హి ప్రాంతంలో తవ్వకాలు జరిపి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ హరప్పన్ కల్చర్‌కు సంబంధించిన అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Samayam Telugu Manoharlal Khattar
రాఖీగర్హి ప్రాంతంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సందర్శన (Photo Credit: @IANS Twitter)


ముఖ్యమంత్రి ఆదేశాలు..
అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని హరియాణా (Haryana) ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తాజాగా పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు. సింధూ నాగరికత కాలానికి (2600-1900 BCE) చెందిన రాఖీగర్హి (Rakhigarhi) అనే గ్రామం హరియాణాలోని హిసార్ జిల్లాలో ఉంది. ఇది పురావస్తు తవ్వకాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా పురావస్తు శాఖ (Archeological Department) అధికారులు తవ్వకాలు జరుపుతూ కొత్త కొత్త విషయాలను కనుగొంటున్నారు. అయితే, ఇప్పటివరకు ఆ తవ్వకాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే జరిగాయి. ఆదివారం మ్యూజియం నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి పురావస్తు తవ్వకాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మ్యూజియంని కూడా త్వరగా నిర్మించాలని ఆదేశించారు. కాగా, ఈ మ్యూజియంలో సుమారు 5 వేల ఏళ్ల క్రితం నాటి వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రాఖీగర్హిలో తవ్వకాలు..
అక్కడ తవ్వకాల్లో దొరికిన వస్తువులు, సామాగ్రీకి (Harappan Culture Artefacts) సంబంధించిన వాటి వివరాలను పొందుపర్చాలని, అక్కడి గ్రామస్థుల వద్ద కూడా ఏమైనా ప్రాచీన కాలానికి చెందినవి ఉంటే సేకరించి వారి పేర్లను కూడా పొందుపర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, ఇక్కడ రాఖీ ఖాస్, రాఖీ షాపూర్ అనే రెండు గ్రామాల్లోనే ఇప్పటివరకు పురాతన ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఈ రాఖీగర్హి ప్రాంతంలో గతంలో దాదాపు 56 అస్థిపంజరాలు బయటపడ్డాయి. వీటిలో రెండు స్త్రీల అస్థిపంజరాలు ఉండగా.. అవి సుమారు 7000 సంవత్సరాల నాటివి కావడం గమనార్హం.

Read All Latest Telugu News and Travel News
రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.