యాప్నగరం

Red Alert in Uttarakhand: టూరిస్టులు ఈ వారం ఉత్తరాఖండ్‌కు వెళ్లకండి.. వాతావరణ శాఖ గట్టి హెచ్చరిక

ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉత్తరాఖండ్‌కు (Red Alert in Uttarakhand) ఇప్పుడు టూరిస్టులు ఎవ్వరూ రావొద్దని భారత వాతావరణ శాఖ సూచించింది. మరో మూడు రోజుల్లో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Authored byKarthik Kumar Kongani | Samayam Telugu 4 Oct 2022, 5:07 pm
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈనెల 7,8 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో టూరిస్టులు ఎవరూ అక్కడికి పర్యాటకం కోసం రావద్దని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ట్రెక్కింగ్, మౌంటెయిన్ క్లైంబింగ్ వంటి యాక్టివిటీస్ చేసే సాహసప్రియులను కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది.
Samayam Telugu uttarakhand


పైన పేర్కొన్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని కుమాన్ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల జిల్లాలోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అధికారి బిక్రమ్ సింగ్ పేర్కొన్నారు. దీంతో టూరిస్టులు, ప్రజలెవ్వరూ కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని కోరారు. అలాగే కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల్లోని ప్రజలు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ ప్రకటనతో తాము అప్రమత్తమయ్యామని, అలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సిస్టమ్ అధికారి వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తాము సంసిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు కురిసే రెండు రోజుల్లో ఏ పర్యాటకులను ట్రెక్కింగ్ లేదా క్లైంబింగ్‌కు వెళ్లొద్దని చెప్పారు.

ఎవరైనా ఇప్పటికే కొండ ప్రాంతాలకు వెళ్లినవారు ఉంటే వెంటనే తిరిగి రావాలని కోరారు. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, గతేడాది అక్టోబర్‌లో ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లినవారు వాతావరణ పరిస్థితుల కారణంగా 10 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు పర్యాటకులను అక్కడికి రావొద్దని కోరుతున్నారు.

రచయిత గురించి
Karthik Kumar Kongani
కార్తీక్ కుమార్ కొంగణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ట్రావెల్\u200cకు సంబంధించిన తాజా వార్తలు,వీకెండ్ స్పాట్ల గురించి వివరించడంతో పాటు,ప్రముఖ పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫొటో ఫీచర్లు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.