How Does Coronavirus Spread? How China Slowed Coronavirus?
Coronavirus in India: లాక్డౌన్.. చైనా ప్రజలు ఎన్నాళ్లు ఇళ్లల్లో ఉన్నారు? మొదటి కేసు ఎప్పుడు నమోదైంది?
కరోనాను తక్కువ అంచనా వేయొద్దు.. ప్రజలతో ఎంతో కఠినంగా వ్యవహరించిన చైనాకు ఎంత టైమ్ పట్టింది? ప్రజలను అలా వదిలేస్తే ఇండియాకు ఏర్పడే ముప్పు ఏ స్థాయిలో ఉంటుంది? అవగాహన కోసం ఈ వివరాలు చూడండి.
Samayam Telugu24 Mar 2020, 8:56 pm
కరోనా వైరస్.. ఎక్కువగా ఇది వయస్సు పైబడినవారికి లేదా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికే సోకుతుందనే అపోహలో ప్రజలు ఉన్నారు. కానీ, ఇది ఎవరినైనా సోకుతుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా ఉండదు. బాధితుల్లో ఉండే రోగ నిరోధక శక్తి, చెడు అలవాట్లు, వ్యాధుల వల్ల మాత్రమే మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. ఈ వైరస్ ప్రతి వ్యక్తిని తన వాహకంగా వాడుకుంటుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. కానీ, వెంటనే దాడి చేయదు. స్లో పాయిజన్లా నెమ్మదిగా పనిచేస్తుంది. సుమారు 14 రోజుల వరకు చడీచప్పుడు చేయకుండా తన పని తాను చేసుకుపోతుంది.
ఈ వైరస్ ఫలితం 14వ రోజుల తర్వాత కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘మహమ్మారి’ అంటారు. ఇటలీలో అన్ని మరణాలు సంభవించడానికి కారణం ఇదే. 14 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం వల్ల బాధితులు తమకి వైరస్ సోకలేదనే భ్రమతో కుటుంబికులను, స్నేహితులను కలిశారు. ఒక్క వ్యక్తి వల్ల సుమారు 4 నుంచి 10 మందికి ఈ వ్యాధి వ్యాపించింది. రోజులు గడిచే కొద్ది ఒక్కొ్క్కరిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. సమాయానికి దీన్ని గుర్తించపోవడం వల్ల వేల మంది చనిపోయారు. ఇక ఇండియా విషయానికి వస్తే.. ఇప్పుడు పరిస్థితి మనకు చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ, రాబోయే రోజులను తలచుకుంటేనే వణుకు పుడుతుంది.
చైనా రోగుల్లో తొలుత కనిపించిన లక్షణాలేమిటీ?
ఉహాన్ హాస్పిటల్లో మొదటి 99 మంది రోగులపై చేసిన అధ్యయన వివరాలను ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’లో ప్రచురించారు. మొదటి బాధితుడు శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతుంటే.. అది న్యూమోనియా అని డాక్టర్లు భావించారు. వైద్య పరీక్షల్లో వారి ఊపిరితీత్తుల్లోని అరలన్నీ నీటితో నిండిపోయాయి. గాలి నుంచి ఆక్సిజన్ సేకరించి రక్తానికి పంపే ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా చాలామంది ఊపిరి పీల్చుకోలేక అవస్థపడ్డారు. చివరికి మరణించారు. వీరిలో మధుమేహం, రక్తపోటు, హృద్రోగంతో బాధపడుతున్న రోగులు కూడా ఉన్నారు. స్మోకింగ్ అలవాటున్న వ్యక్తుల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.
ఇలా ప్రవేశిస్తుంది..
ఈ వైరస్ బాధితుడు వదిలే శ్వాస నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. బాధితుడికి సమీపంలో నిలుచుని మాట్లాడిన అతడి చెమట లేదా శరీరాన్ని తాకినా వైరస్ ప్రవేశిస్తుంది. అలాగే, బాధితుడు తాకిన వస్తువులను ముట్టుకున్నా, అతడి ఉమ్మి, లేదా లాలాజలాన్ని తాకినా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ అంటుకున్న చేతులతో ముఖాన్ని ముట్టుకున్నా ప్రమాదమే. అందుకే, చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ ముందుగా గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లోని కణాల్లోకి చొరబడుతుంది. అక్కడే తిష్టవేసి తన ఉనికి చాటడం మొదలుపెడుతుంది. మరిన్ని శరీర కణాలపై దాడి చేస్తుంది.
5 నుంచి 14 రోజుల్లో ప్రభావం
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన సుమారు 14 రోజులు వరకు ఎలాంటి సమస్య కనిపించదు. కొంతమందిలో మాత్రం 5 రోజుల్లోనే లక్షణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. శరీరం క్రమేనా ఇన్ఫెక్షన్లకు గురవ్వుతుంది. ఈ సందర్భంగా జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి ఏర్పడతాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్లకు స్పందించి వైరస్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫలతంగా జ్వరం లేదా నీరసం వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేసి వైరస్ను చంపే ప్రయత్నం చేస్తుంది. ఈ రసాయనం వల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి. ఆ తర్వాత పొడి దగ్గు వస్తుంది. కొద్ది రోజుల తర్వాత వైరస్ వల్ల నాశనమైన కణాలు కఫం రూపంలో బయటకు వస్తాయి. అంటే కఫం దగ్గు మొదలువుతుంది. ఈ సమయంలో చికిత్స అందిస్తే బాధితుడు కోలుకొనే అవకాశం ఉంటుంది.
రెండో దశ ప్రమాదకరం..
ఇక రెండో దశలో ఆయాశం, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కొందరికి విరేచనాలు కూడా అవుతాయి. తగిన వైద్యం అందకపోతే ఊపిరితీత్తులు ఇన్ఫె్క్షన్కు గురవుతాయి. ఫలితంగా శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైతే వైరస్ మరింత రెచ్చిపోతుంది. న్యూమోనియా ఏర్పడి ఊపిరితీత్తులు నీటితో నిండిపోతాయి. దీంతో రోగి శ్వాస పీల్చుకోలేడు. దీని వల్ల రక్తానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఫలితంగంగా కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. దీంతో అవి పనిచేయడం మానేస్తాయి. దీంతో రోగి చనిపోయే అవకాశాలు ఉంటాయి. వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, దాని వల్లే వారు చనిపోయేందుకు అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. చైనాలో జరిగిన మరణాల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారని, డయాబెటిస్ వంటి దీర్ఘ ఉన్నవారు కూడా ఈ వైరస్కు వేగంగా గురవుతున్నారు. ఈ వ్యాధి ఒక్కసారి సోకితే 14 నుంచి 24 రోజుల సమయం పడుతుంది.
ఒక్కరి వల్ల వందలాది మందికి నష్టం
వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చాలా వేగంగా సోకుతుంది. ఇప్పటివరకు ఇండియాలో తొలిదశలో నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులవే. అయితే, రెండో దశలో వారు కలిసిన వ్యక్తుల్లో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు తొలి దశలో 10 మంది బాధితులు హాస్పిటల్లో చేరితే రెండో దశలో.. వారు కలిసిన వ్యక్తులు హాస్పిటల్లో చేరుతున్నారు. అంటే ఒక్కో బాధితుడు నలుగురిని కలిస్తే.. రెండో దశలో బాధితుల సంఖ్య 40గా నమోదవుతుంది. అలా వ్యాధి ఎంతమందిని సోకుతుందో అర్థం చేసుకోవచ్చు.
కరోనాను కంట్రోల్ చేయకపోతే 30 రోజుల్లో 100 కోట్ల మందికి ముప్పు!
కేవలం పది మంది వ్యక్తుల వల్లే 40 మందికి వ్యాధి వస్తుందంటే.. వందలాది రోగుల వల్ల ఎంతమందికి ఈ వైరస్ సోకుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ వైరస్ సోకిన బాధితుడిలో మొదటి 14 రోజులు పెద్దగా వ్యాధి లక్షణాలు కనిపించవు. దాని వల్ల వారు మిగతావారిని కలుస్తారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో ఇదే పరిస్థితి ఉంది. వారికి వ్యాధి లేదనే కారణంతో అందరితో కలుస్తున్నారు. ఫలితంగా వైరస్ అందరికీ సోకుతోంది. వీళ్లు ప్రజల మధ్య తిరిగితే కేవలం 30 రోజుల్లోనే 100 కోట్ల మందికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే 14 రోజుల వ్యవధిలోనే లక్షల మందికి ఈ వ్యాధి సోకుతుంది. చైనా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొన్ని వేల మందికి వైరస్ సోకింది. అలాంటింది ఎలాంటి జాగ్రత్తలు పాటించని మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి మీకు మరింత అర్థం కావాలంటే.. ఈ కింది వీడియోను చూడండి.
javascript-Facebook
లాక్డౌన్, జనతా కర్ఫ్యూ వల్ల ప్రయోజనాలు ఏమిటీ?
కరోనా వైరస్ను అడ్డుకోవడానికి ప్రభుత్వాల వద్ద ఉన్న ఒకే ఒక్క అవకాశం.. లాక్ డౌన్. కరోనా వైరస్ మనుషుల నుంచే కాదు, వారు తాకిన వస్తువుల నుంచి కూడా వ్యాపిస్తుంది. వస్తువులపైకి చేరే వైరస్ సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుందని, దాన్ని మరెవ్వరైనా తాకితే.. ఆ వైరస్ వారిలోకి చేరుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో వైరస్ బాధితులు తిరిగి.. వైరస్ను అంటించి ఉంటే అది సుమారు 12 గంటలు జీవించి చనిపోతాయి. అందుకే ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ అనేది వస్తువులపై ఉండే వైరస్ను చంపేందుకు తీసుకున్న తొలి ప్రయత్నంగా భావించవచ్చు. లాక్డౌన్ అనేది రెండో దశ. దీనివల్ల వైరస్కు గురైన వ్యక్తులు ప్రజల్లోకి వెళ్లలేరు. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకుకుండా ఆగిపోతుంది.
లాక్డౌన్ సమయంలో ఏం చేయాలి?
మీ ఇంట్లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా అధికారులకు సమాచారం ఇవ్వండి. దీనివల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా వైరస్ ఉన్నట్లయితే ముందుగానే చికిత్స అందించడం సాధ్యమవుతుంది. లేకపోతే ఇతర కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి సోకి మొత్తం ప్రమాదంలో పడతారు. వ్యాధి నిర్ధరణ కాకుండానే హాస్పిటల్లో క్వారంటైన్ (14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం) ఇష్టం లేకపోతే ఇంటి వద్ద కూడా ఉండవచ్చు. దీన్నే హోం క్వారంటైన్ అంటారు. అయితే, వీరు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను టచ్ చేయకూడదు. వారు వాడే వస్తువులు, టాయిలెట్లు ఇతరులు ఉపయోగించకూడదు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే బాధితుడిని హాస్పిటల్లో చేర్చాలి. లాక్డౌన్ సమయంలో బాధితులను బయటకు వెళ్లనివ్వరాదు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకపోయినా సుమారు రెండు వారాలు ఖచ్చితంగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి. ఈ వైరస్ శరీరంలో 37 రోజుల వరకు జీవింగలదని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.
చైనా ఎలా నియంత్రించగలిగింది?
2019, డిసెంబరు 31న 11 మిలియన్ జనాభా కలిగిన హుబీ ప్రావిన్స్లోని ఉహాన్లో గుర్తుతెలియని వైరస్ వల్ల ప్రజలు ఆస్పత్రిపాలవుతున్నారని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సమాచారం ఇచ్చింది. ఈ వైరస్ ఎక్కువగా హునాన్ సీఫుడ్ హోల్సేల్ మార్కెట్లో ఉన్నవారికి వచ్చినట్లు గుర్తించింది. దీంతో ఆ మార్కెట్ను మూసేసింది. జనవరి 11న వైరస్ వల్ల తొలి మరణం సంభవించింది. ఆ మార్కెట్లో ఆహారాన్ని కొనుగోలుచేసిన 61 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. జనవరి 22న 17 మంది చనిపోయారు. 550 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. జనవరి 23 నుంచి చైనా ఉహాన్లో లాక్డౌన్ చేసింది. జనాలను ఇళ్లలోనే నిర్బంధించింది. విమాన, రైలు సేవలు నిలిపేసింది. హుబీ ప్రావీన్స్ పరిసర ప్రాంతాలన్నీ లాక్డౌన్ చేసి జనాలను నిర్బంధించింది. ప్రజల ఇళ్లకు తాళాలు వేసింది. బయటకు వచ్చినవారిపై కేసులు పెట్టింది. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మార్చి 20 నాటికి ‘సున్నా’ కేసులతో ఆశ్చర్యపరిచింది. అంటే సుమారు 2 నెలల పోరాటం తర్వాత వైరస్ను అంతం చేయగలిగింది. ఇండియాలో కూడా ఇదే విధానం పాటిస్తే తప్పకుండా కరోనా తగ్గుముఖం పడుతుంది. ఎంత సమయంలో అనేది ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది.
జలుబు, దగ్గు రాగానే చాలా మంది వైద్యులను ఆశ్రయించకుండా సొంత వైద్యం చేసుకుంటున్నారు. పారాసెటమాల్తో కరోనా తగ్గిపోతుందనే వదంతలతో ఇంటి వద్దే సొంతం వైద్యం చేసుకుంటూ కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఆ ఇంట్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి ఆ వైరస్ సోకుతుందనే కనీస ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి ఢిల్లీకి వచ్చి ఓ ఉద్యోగి ‘సమయం తెలుగు’తో మాట్లాడుతూ.. ‘‘నాలో మొదట ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ, విమానాశ్రయానికి వచ్చేసరికి నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్వారంటైన్కు తరలించారు. చివరికి నాకు పాజిటీవ్ ఉందని తెలిసింది. అయితే, విమానాలు ఎక్కే ముందు కొందరు పారాసెటమాల్ వంటి మాత్రలను వేసుకుని శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకుంటున్నారు. విమానాశ్రయాల్లోని థెర్మో పరికారాలు వారిని గుర్తించడం లేదు. దీంతో వాళ్లు సులభంగ క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్తున్నారు. వారి కుటుబ సభ్యులకు వ్యాధిని అంటించి వైరస్ను వ్యాప్తి చేస్తున్నారు. క్వారంటైన్లో ఉండటం వల్ల మంచే జరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ముప్పు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు.
ఇవి గుర్తుంచుకోండి
బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా ముఖానికి ఫేస్మాస్క్ ధరించండి. దాన్ని మళ్లీ ఉపయోగించవద్దు. ఒక వేళ రీయూజ్ చేసే మాస్కులు ఉంటే.. వెంటనే బాగా మరిగిన నీటిలో ఉడికించి, సబ్బు లేదా డెటాల్తో ఉతకండి. 12 గంటల తర్వాతే మళ్లీ దాన్ని ఉపయోగించాలి. అలాగే, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి. వీలైతే శానిటైజర్ను మీ కూడా ఉంచుకోండి. ఏమైనా వస్తువులను తాకినట్లయితే వెంటనే చేతికి రాసుకుని శుభ్రం చేసుకోండి. చేతులను కడగకుండా ముక్కు, నోరును తాకొద్దు. బాగా ఉడికించిన మాంసం మాత్రమే తినాలి. పచ్చి గుడ్లను తినొద్దు. తుమ్ముతున్న సమయంలో కర్ఛీప్ను అడ్డుపెట్టుకోండి. దీనివల్ల మీరు ఇతరులకు మేలు చేసినవారు అవుతారు. వ్యక్తులకు కనీసం మీటరు నుంచి రెండు మీటర్ల దూరంగా నిలుచోండి. జలుపు, జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. మీరు జాగ్రత్తగా ఉండండి.. సమాజాన్ని కూడా కాపాడండి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.