Up Man Uses Ex-girlfriend's Photos On Posters Across Town, To Take Revenge
వచ్చే వారం పెళ్లి.. ఊరంతా పోస్టర్లు, వధువుకు మాజీ ప్రియుడు షాక్!
మరికొద్ది రోజుల్లో తన మాజీ ప్రియురాలి పెళ్లని తెలిసి మాజీ ప్రియుడు ఎలాంటి పనికి పాల్పడ్డాడో చూడండి.
Samayam Telugu26 Feb 2020, 8:28 pm
ప్రేమ ఎప్పుడు ముదురుతుందో.. మరెప్పుడు ముక్కలవుతుందో తెలియదు. ప్రేయసీ ప్రియుల మధ్య సమన్వయం.. పరస్పర విశ్వాసం లేకపోతే ఆ ప్రేమ ఎప్పటికీ నిలవదు. ప్రేమైనా, పెళ్లయినా నమ్మకమనే పునాదులపైనే నిలబడతాయి. లేకుంటే మనసు ముక్కలవుతుంది. కారణం ఏదైనా.. అప్పటి వరకు ప్రేమించి వెళ్లిపోయే వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడమనేది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఉండకూడదు కూడా. అయితే, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనలు కోకొల్లాలు. ప్రేమలు, ప్రతీకారాలు, హత్యలు, అత్యాచారాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే యూపీలో సభ్యసమాజం ముక్కున వేలు వేసుకొనే మరో ఘటన చోటుచేసుకుంది.
ప్రియురాలిపై ప్రతీకారం
ఉత్తర్ప్రదేశ్లోని సలోన్ గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. బ్రేకప్ తర్వాత ఆమె.. ప్రియుడిని మరిచిపోయి సాధారణ జీవితం గడుపుతోంది. ఇంట్లో తల్లిదండ్రులు చూసిన ఓ లాయర్ను పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించింది. మరో వారంలో రోజుల్లోనే పెళ్లి. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్కు ఓ చెడ్డ ఆలోచన వచ్చింది. తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇదే తగిన సమయమని భావించిన అతడు.. ఊరంతా పోస్టర్లు అతికించాడు.
ఆమె ఫోటోలతో ‘హ్యాపీ హోలీ’ పోస్టర్లు
ఉదయం చూసేసరికి ఆ ఊరిలో ఎక్కడ చూసినా ‘హ్యాపీ హోలీ’ అనే పోస్టర్లు కనిపించాయి. అందులో ఆ యువతి ఫొటోలు ఉండటంతో స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపారు. తొలుత ఇది ఎవరు చేశారనే విషయం వాళ్లకు తెలియలేదు. దీంతో యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానంతో సరోజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ విచారించగా అసలు విషయం తెలిపాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టర్లు వేశానని పేర్కొన్నాడు. సలోన్ సర్కిల్ ఆఫీసర్ వినీత్ సింగ్ స్పందిస్తూ.. ‘‘యాంటి రోమియో టీమ్ సరోజ్ గురించి గాలించింది. ప్రతాప్గడ్లో అతడిని అరెస్టు చేసింది. ఊర్లో అంటించిన పోస్టర్లన్నీ తొలగించాం’’ అని తెలిపారు.
మరో కేసులో.. మాజీ ప్రియురాలి హత్య
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని అకారణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు వేరే యువతిని పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తేవడంతో అతడు మాజీ ప్రియురాలిని కలిశాడు. తనను మళ్లీ ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలి అడిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు.
కేవలం అబ్బాయిలే కాదు, యూపీలోని అమ్మాయిలు కూడా ప్రేమ కోసం బరితెగిస్తున్నారు. హమీపూర్ జిల్లాలో పెళ్లికి కొన్ని నిమిషాల ముందు వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వరుడి కోసం గాలించిన పోలీసులు.. అతడిని కిడ్నాప్ చేసిన యువతిని చూసి షాకయ్యారు. అతడి మాజీ ప్రియురాలే అతడిని ఎత్తుకుపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అతడు తనని ప్రేమించాడని, పెద్దలు వేరే యువతితో తన ప్రియుడికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం యూపీలో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. మున్ముందు ఇంకేమి చూడాలో!!
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.